కూచిపూడి నాట్య చరిత్ర
భారతదేశపు ఎనిమిది శాస్త్రీయ నృత్యశైలులలో కూచిపూడి నాట్యం ఒక విశిష్టమైన స్థానం కలిగి ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మొవ్వ మండలానికి చెందిన “కూచిపూడి” అనే గ్రామంలో పుట్టిన నాట్యకళ. ఈ గ్రామం విజయవాడకు సమీపంగా కృష్ణా నదీ తీరాన కలదు. ఈ చిన్న గ్రామమే ప్రపంచ వ్యాప్తంగా భారతావనికి ఎంతో కీర్తిని తెచ్చిపెట్టిన కూచిపూడి నాట్యకళకు పుట్టినిల్లు.
గ్రామనామం :
ఈ గ్రామానికి ‘కుశీలవపురి’, ‘కుచేలపురి’, ‘కూచన్నపూడి’, ‘కుచ్చిపుండి’ వంటి పలు పేర్లు ఉన్నట్లు పురాణాధారాలు పేర్కొంటున్నాయి. కుచేలునికి శ్రీకృష్ణుడు ఈ గ్రామాన్ని దానం చేశాడని కొందరంటే, కుశీలవులు అనే నాట్యకారుల నివాసం వల్ల ఈ గ్రామానికి ‘కుశీలవపురి’ అనే పేరు వచ్చిందని మరికొందరంటారు. నృత్యవాచస్పతి వేదాంతం పార్వతీశం గారు ఈ వాదనను తన ‘నృత్యతరంగిణీ’ గ్రంథంలో వివరించారు. కాలక్రమంలో ‘కుశీలవపురి’, ‘కూచిపూడి’గా మారింది.
కూచిపూడి నాట్యం యొక్క మూలస్వరూపం
కూచిపూడి నాట్యం అనేది తొలుత ‘నాట్యమేళం’ అనే రూపంలో ఉండేది. భగవంతుని గాధలను కథావస్తువుగా తీసుకొని దానికి నృత్యాన్ని జోడించి నాటకములుగా తయారుచేసి – ఊరురా ప్రదర్శన చేసే విదానం “నాట్యమేళము”. ప్రధానముగా కూచిపూడి గ్రామ కళాకారులు ఈ నాట్యమేళ నిర్వాహకులుగా ఉండేవారు. వీటిద్వారా భగవంతుని కథాకాలక్షేపములు, నీతిభోదలు, సంస్కరణలు మొదలైనవి ప్రధాన ఉద్దేశ్యంగా ఉండేవి. భగవత్సన్నిదిలో పూజావెళలలో భగవంతునికి కైంకర్యార్థమై కళ్యాణమండపంలో, బలిపీటముల వద్ద, ఆలయ ప్రాంగణాలలో మంత్రోచ్ఛారణల మధ్య భక్తిశ్రద్ధలతో ఆచరించేది “నట్టువ మేళం”. అవి చేసే దేవదాశీలు కూడా కూచిపూడి కళాకారుల వద్దనే ఈ విద్యను అభ్యసించేవారు. క్రిని 1201 – 1172 మద్యకాలం
కూచిపూడి నాట్య చరిత్ర
క్రీ.శ 1120 – 1132 మద్యకాలంలో సిద్ధరామయ్య గారు మొట్టమొదటి నాట్యమేళాన్ని స్థాపించారు.
1672 – 1687 సంవత్సరాల మద్యకాలంలో గోల్కొండ నవాబు అబ్దుల్ హసన్ తానీషా, కూచిపూడి గ్రామాన్ని భాగవతులకు అగ్రహారంగా దానం చేశారు.
ఈ అగ్రహారంలో భాగవత కళాకార కుటుంబాలు నాట్యాభివృద్ధికి కృషి చేశారు.
కలాపాలు – గొప్ప సాహిత్యరూపాలు
17, 18 శతాబ్దముల మద్య (శ్రీ భాగవతుల రామయ్యగారు గొల్ల కలాపము రచించారు ఇందులో గొల్లభామ మరియు విప్రుల మద్య జరిగే సంవాదం వలన పిండోత్పత్తి, యజ్ఞపట్టు మొదలైన విషయాలు చర్చకు వచ్చాయి. ఇది వేదాంతమును బోధించే రూపకము. భామాకలాపము తర్వాత ప్రసిద్ధి. చెందిన కలాపము గొల్లకలాపము. మరో 300 సంవత్సరాల తర్వాత అంటే ఇప్పుడు 21 వ శతాబ్దం లో శ్రీ వేదాంతం రామలింగశాస్త్రి గారు మరొక కలాపముగా ఉమాకలాపమును రచించడం జరిగింది.
శ్రీ చింతా వెంకట రామయ్య గారు 1875 వ సంవత్సరంలో వెంకటరావు నాట్యమండలి అను ప్రప్రధమ నాట్య మండలమును ప్రారంభించారు.
స్త్రీల ప్రవేశం – నూతన దిశ
మొదట్లో కూచిపూడి నాట్యం మగవారితోనె నడిచే ఈ కూచిపూడి భాగవతమేళములు క్రీ.శ 1885 -1930 నాటికి సమాజంలో మార్పులు వచ్చాయి. 20వ శతాబ్ద ప్రారంభంలో వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు వ్యస్త నృత్యాంశాలను (solo dance) అభివృద్ధి చేసి స్త్రీలకు నాట్యంలో ప్రవేశ మార్గం ఏర్పరచారు.
కూచిపూడి నాట్యత్రయం
కూచిపూడి నాట్యకళను ఆధునికీకరించి, ప్రపంచానికి పరిచయం చేసిన మూడు మహానుభావులు:
చింతా వెంకటరామయ్య గారు – నాట్యమండలి స్థాపన, యక్షగానాలు.
వెంపటి వెంకటనారాయణ గారు – సాంప్రదాయ నాట్యానికి శాస్త్రీయత కలిపినవారు.
వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు – వ్యస్త నాట్యరూపాలకు పునాదులు వేసి స్త్రీలకు కూచిపూడి నాట్యం ప్రారంభించినవారు.
చలనచిత్రరంగంలో కూచిపూడి
1936లో వేదాంతం రాఘవయ్య గారు “రైతుబిడ్డ” సినిమాలో కూచిపూడి నాట్యాన్ని పరిచయం చేశారు. తరువాత పసుమర్తి కృష్ణమూర్తి, వెంపటి పెదసత్యం మొదలైన వారు చిత్రపరిశ్రమలో నాట్యదర్శకులుగా నిలిచారు. వెంపటి చినసత్యంగారు 1963లో చెన్నైలో కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ స్థాపించి ప్రపంచ వ్యాప్తంగా ఈ కళను వ్యాప్తి చేశారు.
సిద్ధేంద్ర నాట్య కళాశాల
1957లో వేదాంతం పార్వతీశం గారు కూచిపూడి గ్రామంలో యువ కళాకారుల శిక్షణకు ఈ కళాశాల స్థాపించారు. ఇది నేటికీ శ్రీ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలో నాట్యబోధనలో ప్రఖ్యాత సంస్థగా కొనసాగుతోంది.
శాస్త్రీయతకు ధృవీకరణ
1959లో హైదరాబాద్లో జరిగిన మూడు రోజుల సదస్సులో కూచిపూడి నాట్యం శాస్త్రీయతను ఆధారంగా నిరూపించారు. ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి సమక్షంలో నిర్వహించిన ఈ సభ కూచిపూడికి గౌరవం కలిపించింది.
1963లో పద్మభూషణ్ డా. వెంపటి చినసత్యం గారు చెన్నైలో “కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ”ని స్థాపించి కూచిపూడి నాట్యానికి నూతన రూపాన్ని ఇచ్చారు. వారు స్థాపించిన అకాడమీ ద్వారా:
శాస్త్రీయంగా శిక్షణ పొందిన అనేక మంది మహిళా, పురుష నర్తకులు దేశవ్యాప్తంగా ఏర్పడ్డారు.
శ్రీకృష్ణ పారిజాతం, శ్రీకృష్ణ తులాభారం, రుక్మిణీ కల్యాణం, శాకుంతలం, చండాలిక వంటి ఆధునిక నృత్యరూపకాలను సృష్టించారు.
నాట్యం మౌలికంగా ‘ప్రదర్శనకళ’గా మారి అంతర్జాతీయ రంగాలకు పరిచయం అయింది.
విద్యాస్థాపనల అభివృద్ధి
1980 నుండి కూచిపూడి గ్రామంలోని శ్రీ సిద్ధేంద్రయోగి కూచిపూడి నాట్య కళాశాల శ్రీ పొట్టిశ్రీరములు తెలుగు విశ్వవిద్యాలయం పరధిలో నాట్యశిక్షణ సంస్థగా అభివృద్ధి చెంది, ప్రభుత్వం నిర్వహించే డిగ్రీ, పీజీ స్థాయి కోర్సులు ప్రారంభమయ్యాయి.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని సెంట్రల్ యూనివర్సిటీ వంటి విద్యా సంస్థల్లో కూచిపూడి నాట్యం బోధన అందుబాటులోకి వచ్చింది.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాట్య శిక్షణకు ప్రాధాన్యత లభించింది.
కూచిపూడి నాట్యలోకానికి అర్వాచీన మూర్తి త్రయం
పద్మభూషణ్ డా. వెంపటి చిన సత్యం గారు (1929–2012)
కలియుగ సత్యభామ, వేదాంతం సత్యనారాయణ శర్మ గారు
పసుమర్తి వేణుగోపాల కృష్ణ శర్మ గారు
ఇటీవలకాలంలో ప్రముఖ కూచిపూడి కళాకారులు
వేదాంతం రాధేశ్యామ్ గారు, డా. వేదాంతం రామలింగ శాస్త్రి గారు, వేదాంతం దుర్గా భవానీ గారు, పసుమర్తి శేషు బాబు, పసుమర్తి శ్రీనివాస శర్మ గారు, భాగవతుల వెంకటరామ శర్మ గారు, పసుమర్తి రామలింగ శాస్త్రిగారు, యామినీ కృష్ణమూర్తి గారు, శోభనాయుడు, సినీనటి ప్రభ, రాజారెడ్డి- రాధరెడ్డి, DSV శాస్త్రి గారు మొదలైన ఎందరో కళాకారులు ఉన్నారు.
అంతర్జాతీయంగా కూచిపూడి
యుఎస్, యుకే, ఆస్ట్రేలియా, రష్యా, చైనా, జపాన్, మలేషియా, సింగపూర్, అఫ్రికా తదితర దేశాల్లో నర్తకులు ప్రదర్శనలు ఇచ్చారు.
ప్రభుత్వం, ICCR, స్పిక్ మాకే ద్వారా విదేశాల్లో నృత్యప్రదర్శనలు నిర్వహించబడ్డాయి ఇంకనూ నిర్వహించబడుతున్నాయి.
ఆధునిక ప్రపంచంలో కూచిపూడి – ప్రయోగాత్మక మార్పులు
నేటి తరంలో కూచిపూడి నాట్యాన్ని ఆధునిక వేదికలపై మరిన్ని నూతన హంగులతో ప్రదర్శించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా నాట్యబోధన విస్తరించింది.
ముగింపు
ఈ విధంగా కూచిపూడి నాట్యం, ఒక చిన్న పల్లె కూచిపూడి గ్రామం నుండి ఆరంభమై, శతాబ్దాల నాట్యపారంపర్యాన్ని భద్రపరచుకుంటూ, కాలానుగుణంగా తన స్వరూపాన్ని మార్చుకుంటూ భారతీయ శాస్త్రీయ నృత్యశైలులలో ఒక మహత్తరమైన స్థానం సంపాదించుకుంది. శ్రీ సిద్ధేంద్రయోగివారి ద్వారా స్థిరమైన బాట పట్టిన ఈ కళ, నాట్యమేళముల ద్వారా సామూహిక నాట్యంగా వికసించి, వేదాంతం,వెంపటి, పసుమర్తి, భాగవతుల వంటి కుటుంబాల ద్వారా అభివృద్ధి చెంది ప్రపంచవ్యాప్తంగా తన ప్రాముఖ్యతను చాటుకుంది. ఈ సంప్రదాయ నృత్యాన్ని భవిష్యత్తు తరాలకు చేరవేయడం మనందరి బాధ్యత.